
- నిర్మల్ జిల్లాలో రూ. 200 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టినట్లు గుర్తింపు
- డీఎస్వోతో పాటు సివిల్ సప్లై మేనేజర్, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్పై వేటు
- 21 మిల్లుల్లో అక్రమాలు.. 10 మిల్లులపై కేసులు
- ఎనిమిది మిల్లులు, వాటి యజమానుల ఆస్తుల వేలానికి నిర్ణయం
నిర్మల్, వెలుగు :నిర్మల్ జిల్లాలో గత మూడు సీజన్లకు సంబంధించి జరిగిన సీఎంఆర్ అక్రమాలపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. సుమారు రూ. 200 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టినా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులే డైరెక్ట్గా రంగంలోకి దిగారు. అక్రమాలపై ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణలతో నిర్మల్ జిల్లా డీఎస్వో కిరణ్కుమార్తో పాటు సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గోపాల్, నర్సాపూర్ (జి) మండల ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రమాదేవిలను సస్పెండ్ చేశారు. ఇద్దరు జిల్లా స్థాయి, ఒకరు మండల స్థాయి ఆఫీసర్పై ఒకేసారి వేటు పడడం సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో కలకలం రేపుతోంది.
21 మిల్లులలో అక్రమాలు జరిగినట్లు గుర్తింపు
నిర్మల్ జిల్లాలోని 21 రైస్ మిల్లుల్లో సీఎంఆర్ అక్రమాలు జరిగినట్లు టాస్క్ఫోర్స్ ఆఫీసర్లు నిర్ధారించారు. నిర్ధేశించిన గడువులోగా వడ్లను మిల్లింగ్ చేసి బియ్యాన్ని సర్కార్కు ఇవ్వకపోవడంతో పాటు మిల్లుల్లోని ధాన్యం నిల్వల్లో సైతం భారీగా తేడాలు ఉన్నట్లు ఆఫీసర్ల ఎంక్వైరీలో తేలింది. ఈ రిపోర్ట్ను సంబంధిత ఉన్నతాధికారులకు పంపించారు.
దీంతో ఆ మిల్లులపై చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ఆఫీసర్లు సివిల్ సప్లై జిల్లా మేనేజర్కు సూచించారు. అయితే ఈ విషయంలో సంబంధిత ఆఫీసర్లు ఉదాసీనంగా వ్యవహరించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అక్రమాలకు పాల్పడింది మొత్తం 21 రైస్ మిల్లులు అయితే.. 10 మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసుల నమోదుకు సిఫారసు చేశారు. ఈ విషయంలో కూడా ఆశించిన రీతిలో చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపించాయి.
ఎనిమిది మిల్లుల ఆస్తుల వేలానికి నిర్ణయం
ధాన్యం మిల్లింగ్పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు గడువులు పెంచుతూ నిర్లక్ష్యం చేశారు. ఇదే అదనుగా భావించిన మిల్లర్లు అక్రమాలను కంటిన్యూ చేస్తూ వస్తారు. ఆలస్యంగా మేల్కొన్న ఆఫీసర్లు.. రెవెన్యూ రికవరీ చట్టం కింద ఎనిమిది మిల్లులపై కేసు నమోదు చేశారు. ఈ మిల్లులకు చెందిన ఆస్తులతో పాటు, వాటి యజమానుల ఆస్తులను కూడా వేలం వేసేందుకు సంబంధిత తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఒకే మిల్లులో 48 కోట్ల అక్రమాలు
నిర్మల్ జిల్లావ్యాప్తంగా సుమారు 48,500 టన్నులకు పైగా ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ. 200 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని ఒక్క రైస్ మిల్లులోనే సుమారు రూ. 48 కోట్ల విలువైన అక్రమాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ల విచారణలో వెల్లడైంది.
ఈ మిల్లు నుంచి 16,427 టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు ఆఫీసర్లు గుర్తించారు. రాజకీయ పలుకుబడి గల ఈ మిల్లు ఓనర్ మూడు సీజన్ల నుంచి అక్రమాలకు పాల్పడుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపించాయి. సీఎంఆర్ అక్రమాలపై జిల్లా స్థాయి ఆఫీసర్లతో పాటు స్థానిక ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన ఉన్నతాధికారులకు ఇద్దరు జిల్లా స్థాయి ఆఫీసర్లతో పాటు, ఒక మండల స్థాయి ఆఫీసర్పై వేటు వేశారు.